పదండి ప్రపంచాన్ని చుట్టేద్దాం.............
  • పర్యాటక ప్రదేశాలు
  • నేను
  • యాత్రా వార్తలు
  • తెలుగు తరుణి

తిరుమూర్తి టెంపుల్ 

7/29/2013

0 Comments

 
           ఇది తమిళనాడు, తిరుపూర్ జిల్లాలో కలదు. ఇది ఉడుమలైపెట్టై నుండి 22 కి.మీ దూరంలో కలదు. ఇక్కడ ఒకే గుడిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతిమలు కలవు. ఇది ఒకప్పుడు త్రిమూర్తిగా పిలువబడేది. త్రిమూర్తి అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు . తదనంతర కాలంలో అదే తిరుమూర్తిగా ప్రాచుర్యం పొందింది. ఈ గుడికి సంబంధించిన ఒక కథ మనకు వినిపిస్తుంది.

           ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం అత్రి మహర్షి, తన భార్య అనసూయతో కలిసి ఇక్కడ నివసించేవారు. ఒకనాడు నారదుడు అనసూయ యొక్క పాతివ్రత్యం గురించి బ్రహ్మ, విష్ణు మరియు ఈశ్వరుడి ధర్మపత్నులైన  సరస్వతి, లక్ష్మి మరియు పార్వతి దగ్గర ప్రస్తావించాడు. దీనితో ఆ ముగ్గురు దేవతలు అసూయ చెందారు. ఎలాగైనా అనసూయ యొక్క పాతివ్రత్యం తగ్గించమని తమ భర్తలను  వేడుకుంటారు . ఒకనాడు అత్రి మహర్షి లేని సమయంలో త్రిమూర్తులు వెళ్లి అనసూయను భిక్ష అడుగుతారు. కాని వారు ఒక షరతు విధిస్తారు. అనసూయ వివస్త్రగా భిక్ష వేస్తేనే స్వీకరిస్తామని. దీనితో అనసూయకు ఏమి చేయాలో మొదట పాలుపోదు. తరవాత బాగా అలోచించి అనసూయ , మనసులో తన భర్తను తలచుకొని భిక్ష వేయడానికి సిద్ధమవుతుంది. అనసూయ పాతివ్రత్య ప్రభావం చేత త్రిమూర్తులు ముగ్గురు చిన్న పసిపాపలుగా మారిపోతారు. అప్పుడు వాళ్లకు పాలు పట్టి పడుకోబెడుతుంది. తన భర్త వచ్చిన తరవాత జరిగినదంతా చెబుతుంది. జరిగిన దానికి అత్రి మహర్షి చాలా సంతోషిస్తాడు. కొద్దిసేపటి తరవాత త్రిమూర్తులు మేలుకొని, అనసూయ పాతివ్రత్య మహిమను అభినందిస్తారు. ఏదైనా వరం కోరుకొమ్మని అనసూయను అడుగుతారు త్రిమూర్తులు. అనసూయ త్రిమూర్తులను తన బిడ్డలుగా జన్మించాలనే వరాన్ని కోరుకుంటుంది. అది ఈ గుడి వెనుక ఉన్న చరిత్ర.

చూడవలసినవి: తిరుమూర్తి గుడి,  తిరుమూర్తి డ్యాం, తిరుమూర్తి జలపాతం
వసతి: పొల్లాచిలో చాలా హోటల్స్ కలవు.
అందుబాటు : పొల్లాచి నుండి బస్సు సౌకర్యం కలదు.


Picture
తిరుమూర్తి టెంపుల్
Picture
గుడి ముందుగా ఉన్న కొలను
Picture
గుడి ముందు ఉన్న మండపం
Picture
గుడి ముందు ఉన్న ద్వజస్థంభం
0 Comments

రామేశ్వరం 

7/22/2013

0 Comments

 
                      విశాల భారతదేశమందు శ్రీ రామేశ్వర క్షేత్రం ప్రఖ్యాతి గాంచినది. ఇటువంటి క్షేత్రములు భారత దేశములో 4 కలవు. ఉత్తరాన బద్రినాథ్, తూర్పున పూరి , పడమర ద్వారక మరియు దక్షిణమున రామేశ్వరము. ఈ నాలుగు క్షేత్రాలు భారతదేశానికి నాలుగు వైపులా ఉండి మన దేశాన్ని ఎల్ల వేళల కాపాడుతుంటాయి. రామేశ్వరంలోని శ్రీ రామనాథ స్వామి ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.

శ్రీ రామనాథ స్వామి ఆలయం - రామేశ్వరం

                  రాముని చేత ప్రతిష్టించబడి, ఈశ్వరుడు కలడు కనుక ఈ ప్రదేశమునకు రామేశ్వరమనే పేరు వచ్చింది. లంకాధిపతియైన రావణుడు సీతను లంక యందుoచగా, ఆమెను రక్షించుటకు శ్రీరాముడు రామేశ్వరము నుండి లంకకు వెళ్లినట్లుగా రామాయణ ఇతిహాసం తెల్పుచున్నది. శ్రీ రాముడు సముద్ర దేవుడిని హనుమంతునికి దారి ఇమ్మని కోరెను. ఆంజనేయుడు తన వానర సైన్యముచేత పెద్ద పెద్ద బండలతో వారధి కట్టించి లంకకు మార్గం ఏర్పరచెను. రావణ బారి నుండి సీతను రాముడు విడిపించుకొని, రామేశ్వరం  వచ్చి తాను రావణుడిని చంపిన బ్రహ్మహత్యా పాతకమును పోగొట్టమని మునులను అడుగగా వారు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట చేయమని చెప్పినారు. హిమాలయాలలోని కైలాస పర్వతము నుండి  శివ లింగమును తెమ్మని హనుమంతుడిని పంపించెను. సకాలములో ఆంజనేయుడు శివలింగమును తేలేకపోయెను. అంతట సీతాదేవి ఇసుకతో లింగమును తయారు చేసెను. ఆమె పవిత్ర హస్త స్పర్శచే లింగము గట్టిపడి నిలిచెను. ప్రతిష్ట జరిగిన తరువాత వాయుపుత్రుడు లింగముతో
  వచ్చెను. అంతకు ముందరనే ఒక లింగము ప్రతిషించబడి యుండుట చూసి కోపోద్రిక్తమానసుడై , తనతోకతో లింగమును పెకలింప జూచెను. కాని విఫలుడాయెను. వెంటనే శ్రీరాముడు హనుమoతుని బుజ్జగించి, సీతాదేవి ప్రతిష్టించిన లింగము పక్కనే హనుమంతుడు తెచ్చిన లింగమును ప్రతిష్టించి, హనుమా! మొదట నీవు తెచ్చిన లింగమునకే పూజా - పునస్కారాలు జరిపి, తరవాత రామనాథ లింగమును పూజింతురు అనెను. హనుమంతుడు తెచ్చిన లింగమును విశ్వ లింగమని, సీత చేసిన లింగమును రామ లింగమని పిలుతురు.

రామనాథస్వామిని దర్శించుకొనుటకు ముందుగా అగ్ని తీర్థంలో స్నానమాచరించాలి. తరవాత గుడిలోని 22 తీర్థంలలో గల పవిత్ర జలాలతో స్నానం చేయాలి. అవి 1) మహాలక్ష్మి తీర్థం 2) సావిత్రి తీర్థం 3)గాయత్రి తీర్థం 4)సరస్వతీ తీర్థం 5)సేతు మాధవ తీర్థం  6)గండ మాధన తీర్థం  7)కవచ తీర్థం 8)గవయ తీర్థం 9)నల తీర్థం  10)నీల తీర్థం  11)శంకర తీర్థం  12)చక్ర తీర్థం  13) బ్రహ్మ హత్యా పాతక విమోచన తీర్థం 14)సూర్య తీర్థం  15)చంద్ర తీర్థం 16)గంగా తీర్థం  17)యమునా తీర్థం  18)గయా తీర్థం 19)శివ తీర్థం 20)సత్యామృత తీర్థం 21)సర్వ తీర్థం 22)కోటి తీర్థం .  ఇవి అన్నియు గుడిలోనే కలవు. కావున గుడి ఎల్లప్పుడూ తడిగానే ఉంటుంది.

చూడవలసినవి: రామనాథస్వామి గుడి, అగ్ని తీర్థం
వసతి : రామేశ్వరంలో చాలా  హోటల్స్  మరియు సత్రాలు కూడా కలవు.
అందుబాటు : రామేశ్వరంలో లోకల్ బస్సులు కలవు.  

Picture
ఆలయపు ప్రధాన గోపురం (తూర్పు)
Picture
సీత, హనుమంతుడు తెచ్చిన లింగాన్ని ప్రతిష్ట చేయుట
Picture
ఆలయపు దక్షిణ గోపురం
0 Comments

శ్రీ కోదండ రామస్వామి దేవాలయం - ధనుష్కోటి

7/21/2013

0 Comments

 
           ఇది తమిళనాడు, రామంతాపురం జిల్లాలో కలదు. ఇది రామేశ్వరం నుండి 10 కి. మీ దూరంలో కలదు. శ్రీ రామచంద్రుడిని విభీషణుడు శరణు వేడింది ఇక్కడనే. అదియునుగాక, విభీషణుని తాత్కాలిక పట్టాభిషేకము కూడా లక్ష్మణునిచె ఇక్కడనే జరిగినది. రామేశ్వరము నందలి రామలింగ ప్రతిష్టాపన ఉత్సవము రోజున ఉత్సవరులను కేడియం (మనుష్యులు బారుకొయ్యలతో మోయుట) నందు నిలిపి , రామేశ్వరం నుండి ఇచ్చటికి ఉత్సవముతో వచ్చుదురు. రావణ వధానంతరము విభీషణుని పట్టాభిషేకము జరిగి, మరునాడు రామలింగ ప్రతిష్టాపన మహోత్సవము రామేశ్వరము నందు జరుపబడును.

చూడవలసినవి: కోదండ రామస్వామి ఆలయం
వసతి : రామేశ్వరంలో చాలా  హోటల్స్  కలవు.
అందుబాటు : రామేశ్వరం నుండి బస్సు సౌకర్యం కలదు.  
Picture
Picture
0 Comments

గంధమాధన పర్వతం - రామేశ్వరం 

7/21/2013

0 Comments

 
                        ఇది తమిళనాడు, రామంతపురం జిల్లాలో కలదు. ఇది రామేశ్వరం నుండి 2.5 కి.మీ దూరములో కలదు. శ్రీ రాముని పాదములు ఈ గుడి యందు కలవు. ఇక్కడ రెండు అంతస్తుల దేవాలయం కలదు. పై నుండి చూస్తే రామేశ్వర పట్టణం, రామేశ్వరం ద్వీపంలోని కొన్ని  భాగములు కనబడును. శ్రీ రామ చంద్రుడు రావణ సంహారం తర్వాత బ్రహ్మ హత్యా పాతకం పోవడానికి మార్గం ఆలోచించింది ఈ గంధమాధన పర్వతం మీదే.

చూడవలసినవి: రాముని పాదాలు, రామేశ్వర ద్వీపంలోని కొన్ని భాగాలు.
వసతి : రామేశ్వరంలో చాలా  హోటల్స్  కలవు.
అందుబాటు : రామేశ్వరం నుండి ఆటోలు లభించును. 
Picture
గంధమాధన పర్వతం మీద ఉన్న గుడి మొదటి అంతస్తు.
Picture
గంధమాధన పర్వతం మీద ఉన్న గుడి రెండవ అంతస్తు.
Picture
రామేశ్వరపు ద్వీపం యొక్క కొన్ని భాగాలు
0 Comments

గుగంతీశ్వరర్  టెంపుల్     

7/18/2013

0 Comments

 
                                     ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. కన్యాకుమారి రైల్వే స్టేషన్ నుండి 1 కి.మీ దూరంలో కలదు. ఇది 1000 సంవత్సరాల క్రితం నాటిదని, దీనిని రాజ రాజ చోళ అనే రాజు నిర్మించాడని చెపుతారు. చోళుల యొక్క నిర్మాణ శైలి ఈ ఆలయంలో స్పష్టంగా కనిపిస్తుంది.ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఈ ఆలయంలో 10 వ శతాబ్దానికి చెందిన 16 శాసనాలు కనుగొనబడ్డాయి. సందర్శన వేళలు ఉదయం 8 గంటల నుండి 11.15 వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8.45 వరకు.

చూడవలసినవి: గుగంతస్వామి టెంపుల్, భగవతి అమ్మన్ టెంపుల్, వాండరింగ్ మాంక్ ప్రదర్శన,  మ్యూజియం , వాచ్  టవర్,  గాంధీజీ మండపం,  వివేకానంద రాక్ మెమోరియల్,  తిరువల్లువార్ విగ్రహం
వసతి : కన్యాకుమారి  లో  చాలా హోటల్స్  కలవు.
అందుబాటు : రైల్వే స్టేషన్ నుండి నడక ద్వారా చేరుకోవచ్చు.   

Picture
Picture
Picture
0 Comments

భగవతి అమ్మన్ టెంపుల్, కన్యాకుమారి 

7/17/2013

0 Comments

 
                       ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. కన్యాకుమారి అనే పేరు కన్యాకుమారి అమ్మన్ పేరు మీదుగా వచ్చింది. భగవతి అమ్మన్ గుడి కుమారి పార్వతికి అంకితమీయబదినది. ఈ గుడి కన్యాకుమారి పట్టణం నందు త్రివేణి సంగమం వద్ద కలదు. పూర్వం బాణాసురుడనే రాక్షసుడు దేవతల మీద ఆధిక్యం సంపాధించి వారిని అనేక బాధలకు గురి చేస్తుండేవాడు. దేవతలు అందరూ బాణాసురుడి వినాశనం కోసం ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. ఆదిపరాశక్తి ప్రభావంతో అందులోనుండి ఒక కన్య జనిస్తుంది. ఇంతలో పరమశివుడు ఆ అమ్మాయి ప్రేమలో పడతాడు. శివుడు ఆ అమ్మాయిని పెండ్లి చేసుకోగోరి అన్ని ఏర్పాట్లను చేయమని ఆదేశిస్తాడు. నారదుడి వలన శివుడు తన మార్గం నుండి పెండ్లిచేసుకోకుండానే తిరిగి వెళ్ళిపోతాడు.( ఒక కన్య మాత్రమే బాణాసురుడిని చంపగలదు. ఒక వేళ శివుడు ఆ కన్యను పెండ్లి చేసుకుంటే ఆ యజ్ఞ ఫలం వృధా అవుతుందని నారదుడు అలా శివుడిని వెళ్ళిపోయేటట్లుగా చేస్తాడు.)  తర్వాత  ఆ అమ్మాయి శివుడికోసం ఎదురుచూస్తూ అలా కన్యగానే ఉండిపోతుంది. తర్వాత కాలంలో బాణాసురుడిని సంహరించి దేవతలకు ఆ రాక్షస పీడ లేకుండా చేస్తుంది.

చూడవలసినవి: భగవతి అమ్మన్ టెంపుల్, వాండరింగ్ మాంక్ ప్రదర్శన,  మ్యూజియం , వాచ్  టవర్,  గాంధీజీ మండపం,  వివేకానంద రాక్ మెమోరియల్,  తిరువల్లువార్ విగ్రహం
వసతి : కన్యాకుమారి  లో  చాలా హోటల్స్  కలవు.
అందుబాటు : త్రివేణి సంగమం నుండి నడక ద్వారా చేరుకోవచ్చు.   

Picture
Picture
Picture
0 Comments

శుచీంద్రం 

7/17/2013

0 Comments

 
                          ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు.  కన్యాకుమారి నుండి నాగరు కోయిల్ కు పోయే దారిలో కన్యాకుమారి నుండి 14 కి. మీ దూరంలో కలదు. దీనికి జ్ఞాన వనక్షేత్రమనే పేరు కూడా కలదు.ఇచ్చటకు త్రిమూర్తులు వచ్చి అనసూయ దేవి పతివ్రతా ధర్మమును పరీక్షించుటకు భిక్ష యడిగిరి.  త్రిమూర్తులు వివస్త్రగా భిక్షము పెట్టితే గాని అంగీకరించమని చెప్పినారు. అనసూయ దేవి తన పతివ్రతా ధర్మ మహిమచే త్రిమూర్తులను బాలకులుగా చేసి భిక్షము పెట్టినట్లు పురాణం. దేవేంద్రునికి ఇచ్చట మోక్షము సిద్దించినదని చెబుతారు. ఈ ఆలయమున బ్రహ్మ, విష్ణు, శివుడు మొదలైన వారికీ ప్రత్యేక స్థానం కలదు. ఈ ఆలయమున ప్రతి రోజు అర్థరాత్రులందు దేవేంద్రుడు వచ్చి పూజ చేస్తాడని ఇతిహాసములు చెప్పుచున్నవి. దీనినే దేవేంద్ర పూజయని చెప్పుదురు. ఈ గుడి ప్రాకారమున ఒక పెద్ద ఆంజనేయ విగ్రహం ఉన్నది. ఈ ఆలయమున ధనుర్మాసమున, చైత్రమాసమున పెద్ద ఉత్సవాలు జరుగును. ఈ ధనుర్మాస ఉత్సవమును రథోత్సవము అని చెప్పుతారు. చైత్రమాస ఉత్సవమును తెప్పోత్సవము అని చెబుతారు. ఈ ఆలయము బహు పునీతమైనది. ఈ స్థల పురాణమును భక్తితో చదివేవారును, శ్రవణించేవారును , వ్యాఖ్యానం చేసేవారును సర్వ పాప విముక్తులై సద్గతి పొందుతారు.

దేవేంద్రుడు తపస్సు చేసి పాపవిముక్తుడైన ఈ దివ్య ప్రదేశములో స్థానేశ్వరాలయము ఉంది. భక్తులు (మగవారు మాత్రమే) చొక్కాలు తీసి స్వామిని దర్శించుకోవాలి. కళ్యాణమండపము, సంగీత స్థంభాలుగల ఈ ప్రదేశము దగ్గరలో అత్రి, అనసూయ తపస్సు చేసిన ప్రదేశాలున్నాయి.

చూడవలసినవి: శుచీంద్రం కోయిల్,  అమ్మన్ కోయిల్
వసతి : నాగర్ కోయిల్ మరియు కన్యాకుమారిలలో  చాలా హోటల్స్  కలవు.
అందుబాటు : నాగర్ కోయిల్ నుండి మరియు కన్యాకుమారి నుండి  లోకల్ బస్సు సౌకర్యం కలదు.

Picture
Picture
Picture
Picture
0 Comments

నాగై అమ్మన్ కోయిల్ , శుచీంద్రం 

7/16/2013

0 Comments

 
                                             ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో కలదు. ఇది కన్యాకుమారి నుండి 14 కి.మీ దూరంలోని శుచీంద్రంలో కలదు. గుడి ముందుగా ఒక పెద్ద కొలను కలదు. భక్తులు ఇందులో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తులు (మగవారు మాత్రమే) చొక్కాలు తీసి,  అమ్మవారిని దర్శించుకోవాలి.

చూడవలసినవి:  అమ్మన్ కోయిల్
వసతి : నాగర్ కోయిల్ మరియు కన్యాకుమారిలలో  చాలా హోటల్స్  కలవు.
అందుబాటు : నాగర్ కోయిల్ నుండి మరియు కన్యాకుమారి నుండి  లోకల్ బస్సు సౌకర్యం కలదు.
Picture
Picture
Picture
0 Comments

నాగరాజ గుడి, నాగర్ కోయిల్ 

7/16/2013

0 Comments

 
                              ఇది తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలోని నాగర్ కోయిల్ పట్టణము నందు  కలదు. నాగర్ కోయిల్ అనే పేరు ఈ నాగరాజ గుడి మూలంగానే వచ్చిందని చెపుతారు. ఈ గుడి ముందు ఒక చిన్న కొలను లాంటిది కలదు. కొలనులో భక్తులు స్నానం చేసి నాగరాజ స్వామిని దర్శిస్తారు. కొలను పక్కగా ఒక దిమ్మె మీద  చాలా నాగరాజ విగ్రహాలు కలవు. భక్తులు పసుపు మరియు పాలతో వీటిని అభిషేకిస్తారు. ఈ గుడిలో మనకు ఎక్కడ చూసినా నాగరాజ ప్రతిమలే కనిపిస్తాయి. ఈ గుడిలో ఇద్దరు ప్రధాన దైవాలు. ఆనంద కృష్ణ మరియు నాగరాజ. నాగరాజ గర్భాలయంలో వూరు నీటి వూటలోని నీటిని తీర్ధముగా ఇస్తారు. ఈ నీటి వూటలోని ఇసుక సంవత్సరములో సగభాగం తెల్లగాను మరియు మిగిలిన సగభాగం నల్లగాను ఉంటుంది.

చూడవలసినవి:  నాగరాజ గుడి
వసతి : నాగర్ కోయిల్ మరియు కన్యాకుమారిలలో  చాలా హోటల్స్  కలవు.
అందుబాటు : నాగర్ కోయిల్ నుండి లోకల్ బస్సు సౌకర్యం కలదు.
Picture
నాగరాజ గుడి ప్రధాన ద్వారం
Picture
గుడి ముందుగా ఉన్న కొలను
Picture
భక్తులు పసుపుతో మరియు పాలతో నాగరాజ ప్రతిమలను అభిషేకిస్తున్నారు.
Picture
ఆనంద కృష్ణ మరియు నాగరాజ ఆలయాలు
0 Comments

మాసాని అమ్మన్ తిరుకోయిల్

7/7/2013

0 Comments

 
                                        ఇది తమిళనాడు, కోయంబత్తూర్ జిల్లాలో కలదు. కోయంబత్తూర్ నుండి   55 కి.మీ దూరంలో, పొల్లాచి కి సమీపంలో అనైమలై అనే గ్రామంలో కలదు. ఈ గుడి అమ్మవారికి చెందినది. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారు చాలా శక్తివంతమైనదని, కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి. ఇక్క ఉన్న అమ్మవారి విగ్రహం పడుకొన్నట్లుగా (అలియార్ నదికి సమాంతరంగా) ఉంటుంది. రాముడు సేతాన్వేషణ సమయంలో ఇక్కడికి రావడం మరియు ఇక్కడ కొద్ది రోజులు ధ్యానం చేసినట్టుగా ఇక్కడి వారి నమ్మకం.

               ఈ గుడికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉన్నది. పూర్వం ఈ ప్రాంతాన్ని నానన్ అనే రాజు పరిపాలించేవాడు. అలియార్ నది ఒడ్డున పంటపొలాల దగ్గర ఒక ప్రత్యేకమైన మామిడి చెట్టు కలదు. ఆ మామిడి చెట్టన్నా, దాని పండ్లన్నా రాజు గారికి చాలా ఇష్టం. రాజు గారి ఆజ్ఞ ప్రకారం ఆ చెట్టు ఆకులను కానీ, పండ్లను కానీ ఎవరు ఉపయోగించడానికి వీల్లేదు. ఒక  రోజు 
కొంత మంది అమ్మాయిలు నది ఒడ్డున స్నానం చేస్తూ నీటిలో తేలియాడుతున్న మామిడిపండును చూసారు. అది రాజు గారి చెట్టుకు సంబంధించిన మామిడి పండు. అందులో ఒక అమ్మాయి ఆ మామిడి పండును తిన్నది. ఇది రాజు గారికి తెలిసి ఆ అమ్మాయికి మరణ దండన విధించాడు. కొద్ది రోజుల తర్వాత  అక్కడ నివసించేవారు పడుకొని ఉన్న ఒక అమ్మాయి విగ్రహాన్ని తయారు చేయించి , ఆ అమ్మాయికి గుర్తుగా పూజించడం ప్రారంభించారు. తరవాత కాల క్రమంలో ఆమె మాసానిగా ప్రసిద్ధి చెందిది.  కొద్ది రోజుల తర్వాత కోరిన్ ఖోసర్గల్  అనే రాజు నానన్ ని ఓడించి, ఆ చెట్టును ధ్వంసం చేసాడు.


చూడవలసినవి: మాసాని అమ్మన్ తిరుకోయిల్ , అలియార్ నది
వసతి : కోయంబత్తూర్ మరియు పొల్లాచి  లో  చాలా హోటల్స్  కలవు.
అందుబాటు : పొల్లాచి నుండి బస్సు సౌకర్యం కలదు. 

Picture
మాసాని అమ్మన్ కోయిల్ కు వెళ్ళే దారిలో
Picture
మాసాని అమ్మన్ కోయిల్ కు ముఖ ద్వారం
Picture
మాసాని అమ్మన్ తిరు కోయిల్
Picture
అలియార్ నది ప్రవాహం
0 Comments
<<Previous
Forward>>

    విహారయాత్రకు స్వాగతం. ఇందులోని పోస్టులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు మీ మిత్రులతో వాటిని పంచుకోవాలంటే పేస్ బుక్ ఓపెన్ చేసినతరవాత సెర్చ్ ఐటమ్స్ లో "vihaarayaatra" అని టైప్ చేయండి. విహారయాత్ర యొక్క ఫేస్ బుక్ హోమ్ పేజి వస్తుంది. అక్కడ మీకు కావలసిన వాటిని షేర్ చేయండి. …….. మీ విహారయాత్ర

    నా గురించి

    నా పేరు బద్రినారాయణ ఆనందం. నన్ను మెచ్చేవాళ్ళు , నాకు కావలసినవాళ్లు నన్ను ముద్దుగా బద్రి అని పిలుస్తారు. నాకు చిన్నప్పటినుండి కొత్త కొత్త ప్రదేశాలనన్నింటిని చూడాలని కోరికగా ఉండేది. ఈమద్య కాలం నుండి నేను వరుసగా  చాలా ప్రదేశాలు దర్శిస్తున్నాను. నాలాగే చాలా మందికి చాలా ప్రదేశాలు చూడాలని కోరికగా ఉండవచ్చు. కొందరు వెళ్ళవచ్చు మరికొందరు వెళ్ళలేకపోవచ్చు. కొందరికి వెళ్లాలని ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు మరియు దాని గురించిన సమాచారం కూడా దొరకకపోవచ్చు. నేను వెళ్తున్న ప్రదేశాల వివరాలు మరియు వాటి ఫోటోలు ఇక్కడ మీకందిస్తున్నాను. ఇవి మీకందరికీ కూడా నచ్చుతాయని మరియు ఉపయోగపడతాయని ఆశిస్తూ ....   మీ బద్రి  


    vihaarayaatra.weebly.com

    Promote Your Page Too
    Foreign Languages Institute

    Promote Your Page Too
    Telugutaruni

    Promote Your Page Too
    letustravel.weebly.com

    Promote Your Page Too

    Archives

    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013

    Categories

    All
    Andhra Pradesh
    Aquarium
    Church
    Dam
    Fort
    Garden
    Karnataka
    Kerala
    Lake
    Memorial
    Miscellaneous
    Mosque
    Mountain
    Museum
    Palace
    Park
    Rajasthan
    Tamilnadu
    Temple
    Travel News
    Uttarakhand
    Waterfall
    Zoo

    Enter your email address:

    Delivered by FeedBurner

    Picture
    ఇక్కడ మీరు చూస్తున్నది చార్మినార్. కాని ఇది హైదరాబాద్ లోనిది కాదు. తమిళనాడు, కోయంబత్తూర్ లోనిది.

    Picture
    పండ్ల ప్రదర్శన - 2013

    Picture
    శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి ఆలయం

    Picture
    Picture

    Picture

    Picture

    Picture

    Picture

    Picture

    Picture

    Picture





    Picture
    Picture
    Picture
    Picture
    poodanda
    Blaagulokam logo
    మొత్తం పేజీ వీక్షణలు
    vihaarayaatra.weebly.com
Powered by Create your own unique website with customizable templates.